Are Telangana youth ready for army jobs? CM Revanth with Lieutenant General

తెలంగాణ యువత ఆర్మీ ఉద్యోగాలకు రెడీనా.. లెఫ్టినెంట్ జనరల్‌తో సీఎం రేవంత్

Spread the love

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి.రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం తెలియజేశారు. ఆర్మీ నియామకాల్లో స్థానిక యువతకు భారీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆసక్తి చూపుతున్న, అనువైన జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీనిపై లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు.

 

అలాగే, విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపైనా సీఎం చర్చించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణలో విపత్తు పరిస్థితుల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తామని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ తెలిపారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ కొనియాడారు. హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, చారిత్రక వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మూసీ నది పునరుజ్జీవనం అవసరమని పేర్కొన్నారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *